Friday, 12 June 2026 01:45:27 AM

వెనక బెంచీలోనే బొత్స , చిన్న శీను

Date : 19 May 2026 06:39 PM Views : 86

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విజయనగరం : మే 19 : చదవేస్తే ఉన్న మతి పోయిందీ అన్నాడట " వెనకటికొకడు. ఫింగర్ టిప్స్ మీద అసలు సిసలైన రాజకీయం నెరపడంతో పాటు రాజకీయాల్లో కాళ్ళు, చేతులు కొంకర్లు తిరిగిపోయిన విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ వైసీపీ నేతల చందం కూడా అచ్చం అలాగే ఉంది. మాజీ ఎమ్మెల్యే , మాజీ ఎంపీ , మాజీ మంత్రి , ప్రస్తుత ఎమ్మెల్సీ , శాసన మండలిలో ప్రతిపక్ష నేత , రాజకీయ ఉద్ధండుడు బొత్స చీపురుపల్లి నియోజకవర్గానికి ఇంచార్జి గా ఉన్నారు... అదే నియోజకవర్గం మెరకముడిదాం మండలం జెడ్పిటీసిగా, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా చిన్న శీను ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదే నియోజకవర్గానికి జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ శోభా స్వాతీ రాణి పార్టీ పరిశీలకురాలిగా వ్యవహరిస్తున్నారు. జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ , మాజీ ఎంపీ , వైసీపీ రాష్ట్ర పి. ఏ. సి. సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు ) సాక్షాత్తు చీపురుపల్లిలోనే నివాసం ఉంటున్నారు. చీపురుపల్లితో పాటు నియోజకవర్గంలో జెడ్పిటిసిలు, ఎంపీపీలు సహా మెజారిటీ ఎంపీటిసిలు, సర్పంచులు కూడా వైసీపీ వాళ్ళే.. బొత్స , చిన్న శీను మాత్రమే కాకుండా బొత్స సతీమణి , మాజీ ఎంపీ, జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ జాన్సీ లక్ష్మి, తనయుడు సందీప్, తనయ తనూజ సమయం , సందర్భం చూసుకుని మరీ నియోజకవర్గమంతా కలియ తిరుగుతూనే ఉన్నారు. పార్టీ సోషల్ మీడియా వారియర్స్ ఎలాగూ ఉండనే ఉన్నారు. విచిత్రం ఏంటంటే , ఇంత మంది హాయ్.. హాయ్.. భాయ్.. భాయ్ అంటూ చెప్పులరిగేలా తిరుగుతున్నా, రాజకీయం చేస్తున్నా పార్టీ ఐ. డి.వెరిఫికేషన్ లో చీపురుపల్లి నియోజకవర్గం వెనుకబడి ఉండడం... త్వరగా పూర్తి చెయ్యండహో అంటూ క్యాడర్ కి అప్పీల్ చెయ్యడం... కొస మెరుపు ఏంటంటే , ఈ చోద్యమంతా కళ్ళారా చూస్తూ... చెవులారా వింటున్న జనం " ముందు ఇంట గెలిచి రచ్చ గెలవండని " ఆ తర్వాత సూక్తి ముక్తావళి వల్లించండని పైకి అనకపోయినా సదరు నేతలను గేలి చెయ్యడం... హేళనగా మాట్లాడుకోవడం...!. ----------- తిప్పరాజు రాధాకృష్ణ , జర్నలిస్ట్ , విజయనగరం

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :