Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : ఆగష్టు 20 సాక్ష్యం న్యూస్ డెస్క్: విశాఖ జిల్లా పద్మనాభం మండలం రేవిడి పంచాయతి పరిధి గోస్తనీ నదిలో ఇసుక త్రవ్వకాలు యదేశ్చగా కొనసాగుతున్నాయి. అడ్డు చెప్పేవారు లేకపోవడం, ఇసుకాసులకు కాసుల పంట పండుతోంది. చీకటి పడితే చాలు రేవిడి రెడ్డి వారి కళ్ళాల వద్ద గోస్తనీ నదిలో లారీలు, JCBల శబ్దాలు మొదలవుతాయి. దొరికిందంతా దోచెయ్-అన్నట్లు పెద్ద పెద్ద గోతులు త్రవ్వి ఇసుకను లారీల ద్వారా దగ్గరలోని తోటల్లో డంప్ చేస్తున్నారు. వాటిని సమయం చూసి ఇతర ప్రాంతాలకు తరలించి లక్షల్లో సంపాదిస్తున్నారు.
మరోవైపు గోస్తనీ నదికి ఆనుకుని ఉన్న బంజరు భూములను సైతం చదును చేసి ఆక్రమించేస్తున్నారు. దీనంతటి వెనుక పెద్ద ముఠానే ఉందని అర్ధమవుతుంది. సాక్ష్యం టివి పరిశోధనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. ఈ వ్యవహారం స్థానిక ఓ వైసిపి నాయకుడి కనుసన్నల్లో నడుస్తుందని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ మరియు బంజరు భూములను కాపాడాల్సిన రెవెన్యూ యంత్రాంగం మొద్దు నిద్రలో ఉండటంపై విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా అధికారులు దృప్టిపెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Reporter
Neti Sakshyam